జీఎన్ నాయుడు పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి
- యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు కన్నుమూత
- హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు, లోకేశ్
- నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు
యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ జీఎన్ నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేశ్.. నాయుడు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ జీఎన్ నాయుడుతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. రీజెన్సీ సంస్థల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన అగ్రగామిగా నిలిచారని సీఎం కొనియాడారు. నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటని, ఆయన రూపంలో తెలుగు ప్రజలు ఒక గొప్ప పారిశ్రామికవేత్తను కోల్పోయారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.